అమరావతి, మే 02, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల మధ్య విద్యుత్ సరఫరాపై ఎలాంటి అంతరాయం ఉండకూడదని ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఎంత డిమాండ్ ఉన్నా కరెంట్ కోతలు విధించడాన్ని అసలు అనుమతించబోమని ఆయన అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.శనివారం విద్యుత్ శాఖ సీఎండీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా పరిస్థితిపై సమీక్షించారు. అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ ఎక్కడా విద్యుత్ కోతలు ఉండకూడదని స్పష్టంగా చెప్పారు. ప్రజలకు నిరంతర విద్యుత్ అందించడం ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు.వేసవి కాలంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని మంత్రి సూచించారు. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా సమస్యలు తలెత్తినా, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.సాంకేతిక కారణాలతో విద్యుత్ సరఫరా అంతరాయం కలిగితే ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని, అలాగే సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా తక్షణ స్పందనతో వ్యవహరించాలని సూచించారు.సమీక్ష సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, అకాల వర్షాల ప్రభావంతో విద్యుత్ అంతరాయం కలుగుతోందని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి, ఫీల్డ్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన అన్ని వనరులను సమీకరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని మంత్రి హెచ్చరించారు. వేసవి కాలంలో విద్యుత్ సేవలపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
