హైదరాబాద్, మే 02, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ముఖ్యంగా కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకున్నారు. సొంత తండ్రి అయిన కే. చంద్రశేఖర్ రావుపై విమర్శలు చేయడం తగదని ఆయన స్పష్టం చేశారు.ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడిన దానం నాగేందర్, బీఆర్ఎస్ నాయకులు కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. వారికి అత్యుత్సాహం ఎక్కువైందని విమర్శిస్తూ, గతంలో ఫోన్ ట్యాపింగ్ వంటి ఆరోపణలు ఎదుర్కొన్నవారే ఇప్పుడు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రైతులకు ‘రైతు భరోసా’ అందిస్తున్నామని, ఆలస్యమైనా సరే అమలు చేయడం మంచిదేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎవరినీ వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం లేదని స్పష్టం చేశారు.మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును ప్రజానాయకుడిగా అభివర్ణించిన దానం నాగేందర్, ఆయన ప్రజల్లోనే ఉంటారని, అవసరాన్ని బట్టి బయటకు వస్తారని చెప్పారు. ఈ సందర్భంలో కవితపై వ్యాఖ్యలు చేస్తూ, రాజకీయంగా మాట్లాడాల్సింది పోయి కుటుంబ విషయాలను బయటకు తీసుకురావడం సరికాదని అన్నారు.“తల్లిదండ్రులను గౌరవించలేని వారు సమాజంలో ఎలా ఆదర్శంగా నిలుస్తారు?” అంటూ ప్రశ్నించిన ఆయన, సొంత తండ్రిని విమర్శించడం ద్వారా ఆయనను డీమోరల్ చేయడం తగదని పేర్కొన్నారు. కవిత తన వ్యాఖ్యల్లో పరిమితి పాటించాలని హితవు పలికారు.
