హైదరాబాద్, మే 02, (నేటి తెలుగు పత్రిక): వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల భారీ పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు తీవ్రంగా స్పందించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి భారీగా ధరలు పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతోందని విమర్శించారు.ఒక్కసారిగా దాదాపు రూ.1000 వరకు పెంచిన ధరలతో హోటల్, రెస్టారెంట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.3,315కు చేరుకోవడం చిన్న, మధ్య తరహా వ్యాపారులకు పెద్ద దెబ్బగా మారిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో అనేక హోటళ్లు మూతపడే పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.హోటల్ రంగంపై ఈ ప్రభావం కేవలం వ్యాపారాలకే పరిమితం కాకుండా, లక్షలాది కార్మికుల ఉపాధిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల ప్రభావంతో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని, ఇప్పుడు గ్యాస్ ధరల పెంపు మరింత ఇబ్బందులను తెచ్చిపెడుతుందని వ్యాఖ్యానించారు.మే డే సందర్భంగా కార్మికులకు ఇది ఏ రకమైన ‘కానుక’ అని ప్రశ్నించిన ఆయన, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.వాణిజ్య గ్యాస్ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన కేటీఆర్, లేదంటే వ్యాపార రంగం తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు.
