Breaking News

లోకేశ్ పనితీరుకు వెంకయ్యనాయుడు ప్రశంసలు.. ప్రభుత్వ పాఠశాల ఫలితాలపై హర్షం

మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో తాజా పరిణామాలపై భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ పనితీరు చాలా బాగుందని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన మెరుగైన ఫలితాలను ఆయన కొనియాడారు. విద్యా రంగంలో జరుగుతున్న మార్పులు సానుకూల దిశగా ఉన్నాయని పేర్కొన్నారు.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు, విద్యతో పాటు సమాజంలో విలువల ప్రాధాన్యతపై కూడా దృష్టి సారించారు. పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని పేర్కొంటూ, ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించకుండా మొబైల్, టీవీలకు పరిమితమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ విలువలు బలపడితేనే సమాజం సరిదిద్దబడుతుందని సూచించారు.ఈ సందర్భంగా ఆయన ఆధ్యాత్మికత ప్రాముఖ్యతను కూడా ప్రస్తావించారు. మనసుకు ప్రశాంతత, ఆనందం కలిగించడంలో ఆధ్యాత్మికత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. సమాజం దారి తప్పినప్పుడు దానిని సరైన మార్గంలో నడిపించేందుకు మహానుభావులు అవతరిస్తారని, చరిత్రలో అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని చెప్పారు.అలాగే ప్రస్తుత సమాజ పరిస్థితులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ పత్రికల్లో వచ్చే కొన్ని వార్తలను చూస్తుంటే బాధ కలుగుతోందని, సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయని అన్నారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పెరుగుతుండటంతో మన సంప్రదాయాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి తన కుటుంబం నుంచి సమాజం వరకు శాంతి, సౌహార్దతను కాపాడాలని పిలుపునిచ్చారు.తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ, తన కుటుంబ సభ్యులు తమ తమ రంగాల్లో కొనసాగుతుండగా, రాజకీయాల్లోకి రాకూడదనే పరస్పర అవగాహనతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. మంచి పనులు చేసే నాయకులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన సూచించారు.

సింగపూర్‌కు ఏపీ ఉపాధ్యాయుల బృందం

అమరావతి అభివృద్ధికి బూస్ట్.. క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్ సిగ్నల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *