మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణికులతో సానుకూలంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందిని వేధింపులకు గురిచేయకుండా ప్రేమతో పనులు చేయించుకోవాలని డివిజన్ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో జరిగిన సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై జూమ్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, పలు కీలక సూచనలు చేశారు. డ్రైవర్లు, కండక్టర్లు సహా సిబ్బందితో దురుసుగా కాకుండా స్నేహపూర్వకంగా ఉండాలని, ప్రయాణికులతో మంచి సంబంధాలు కొనసాగించాలని స్పష్టం చేశారు. మే 17లోగా డిపోలు, బస్ స్టేషన్లలో టాయిలెట్లు, తాగునీరు, పరిశుభ్రత, మొక్కల నాటడం వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఆదేశించారు. కొన్ని డిపోలు నష్టాల్లో నడవడానికి గల కారణాలను సమీక్షించి చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.టికెట్ల విషయంలో సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని, సిబ్బంది మధ్య అంతర్గత విభేదాలు ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రతి రెండో మంగళవారం సిబ్బంది సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.ఆర్టీసీ అభివృద్ధి కోసం మంత్రి నుంచి సిబ్బంది వరకు అందరూ కలిసి పనిచేయాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
