మాధవరంలో ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు.
ఎ.కొండూరు మే 3 (నేటి తెలుగు పత్రిక): ఈ నెల 9వ తేదీన ఎ.కొండూరు మండలంలోని తూర్పు మాధవరం గ్రామంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదివారం పరిశీలించారు. సమగ్ర భూ సర్వే కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను నేరుగా పంపిణీ చేయనున్న నేపథ్యంలో సభా స్థలం, హెలీప్యాడ్కు అనువైన ప్రాంగణాలను జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, తిరువూరు ఆర్డీవోఏ. కుమార్ మరియు అధికారులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, సీఎం పర్యటన విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సభా ప్రాంగణంలో తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, రహదారులు, వాహన పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.అనంతరం మండల తహశీల్దార్ కార్యాలయంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, మాధవరం గ్రామంలోని మౌలిక వసతులు, రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీసి నివేదిక సమర్పించాలని సూచించారు.రూ.49 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్న జల్ జీవన్ మిషన్ పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు. జల్ జీవన్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ సంప్ వెల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంచనంగా ప్రారంభిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. దీప్లానగర్ తండాలో ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందుతున్న తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కృషితో స్వచ్ఛమైన కృష్ణా జలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు.కలెక్టర్ పర్యటనతో గ్రామంలో అధికారులు అప్రమత్తమై ఏర్పాట్లను వేగవంతం చేశారు. సీఎం రాక నేపథ్యంలో మాధవరం గ్రామంలో సందడి నెలకొంది.
