మే 03, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్లోని జ్యోతినగర్ ప్రాంతంలో ఉన్న పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పుల ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. షాపులో జరిగిన కాల్పులపై సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన మంత్రి, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, స్థానిక నాయకులతో కలిసి ఘటన స్థలాన్ని సందర్శించారు. అనంతరం పోలీస్ అధికారులతో చర్చించి దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు.మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, ఐదుగురు దుండుగులు బంగారం కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ షాపులోకి ప్రవేశించారు. మొదట ఒక వ్యక్తి 20 గ్రాముల గొలుసు చూపించాలని అడగగా, తర్వాత మరో ఇద్దరు వచ్చి ఆభరణాలు చూడాలని కోరారు. ఆ సమయంలో మరో ఇద్దరు చేరడంతో మొత్తం ఐదుగురు కలిసి తుపాకులతో బెదిరించి దోపిడీకి ప్రయత్నించారు.సిబ్బంది అడ్డుకోవడంతో దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో షాపు సేల్స్ మేనేజర్తో పాటు ఇతర సిబ్బందికి గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం వారి ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్కు తరలిస్తున్నారు.ఈ ఘటనకు కొద్ది నిమిషాల ముందు సమీపంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నట్లు తెలిపారు. ఘటన తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమై నగరాన్ని చుట్టుముట్టి దుండుగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.సీసీటీవీ ఫుటేజ్, క్లూస్ టీం సహాయంతో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దోపిడీ ప్రయత్నంలో ఒక బ్యాగ్ను అక్కడే వదిలి వెళ్లినట్లు సమాచారం. ఎంత మేరకు బంగారం దోచుకెళ్లారన్నది విచారణలో తేలనుంది. దుండుగులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
