పశ్చిమ గోదావరి, మే 03, (నేటి తెలుగు పత్రిక): ఆకివీడులో వివాదాలకు కేంద్రబిందువైన రామాలయ పునర్నిర్మాణ పనులకు ఆదివారం శుభారంభం జరిగింది. భారీ పోలీసు బందోబస్త్ మధ్య వేలాది మంది భక్తుల సమక్షంలో భూమిపూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. ఉదయం నిర్ణయించిన శుభముహూర్తంలో భూమిపూజ నిర్వహించి ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. భక్తులు జైశ్రీరామ్ నినాదాలతో ప్రాంతాన్ని భక్తి మయంగా మార్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు కోర్టును ఆశ్రయించినప్పటికీ ఎలాంటి అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తూ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.ఆలయాన్ని సంప్రదాయ శైలిలో కృష్ణశిలతో నిర్మించనున్నట్లు చెప్పారు. దీర్ఘకాలం నిలిచేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. ఈ ఆలయం ప్రాంతీయ భక్తి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.భూమి వినియోగం, అనుమతుల అంశాలపై కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నప్పటికీ, శంకుస్థాపనతో ప్రాజెక్ట్ ముందడుగు వేసినట్లైంది. కార్యక్రమం మొత్తం పోలీసుల పర్యవేక్షణలో ప్రశాంతంగా ముగిసింది.
