మే 03, (నేటి తెలుగు పత్రిక): డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనపై ప్రభుత్వం గంభీరంగా స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంది.ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులపై వైద్యారోగ్య శాఖ వెంటనే విచారణ చేపట్టింది. ప్రాథమిక దర్యాప్తులో ఆరోపణలకు బలం ఉన్నట్లు తేలడంతో నలుగురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. విద్యార్థినుల భద్రత, గౌరవాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. మౌళి నాయక్ను సస్పెండ్ చేశారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ కె.వి. సుబ్రహ్మణ్యంను కూడా తక్షణమే సస్పెండ్ చేశారు.విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని భావిస్తూ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. నిర్మలా జ్యోతిబాయి, పీఎస్పీ విభాగ ప్రొఫెసర్ కె. విజయ కుమారిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. సంస్థలో జరుగుతున్న పరిణామాలను సమర్థవంతంగా నియంత్రించలేకపోయారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ ఘటనపై ఆయుష్ ఇన్చార్జ్ కమిషనర్ రోణంకి గోపాలకృష్ణ స్పందిస్తూ, విద్యార్థినుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. ఎవరైనా తప్పు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సంఘటనతో కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల్లో ఆందోళన నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవడంతో కొంత విశ్వాసం ఏర్పడింది. విద్యాసంస్థల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
