మే 03, (నేటి తెలుగు పత్రిక): పాలకొల్లులో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.పట్టణంలోని 1 నుంచి 15 వార్డుల పరిధిలో సుమారు రూ.3.8 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ పనులు స్థానిక మౌలిక వసతుల మెరుగుదలకు దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండూ సమాన ప్రాధాన్యం కలిగిన అంశాలని తెలిపారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని, వచ్చే జులై నాటికి మిగిలిన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందజేస్తామని తెలిపారు.ఇప్పటి వరకు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఆరోగ్య సహాయ నిధి ద్వారా రూ.13 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రజలకు అందించినట్లు మంత్రి వెల్లడించారు.ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
