సంగారెడ్డి, మే 03, (నేటి తెలుగు పత్రిక): భారతీయ జనతా పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రం నడుస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో నిధుల కొరత ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని గుర్తు చేశారు.కాంగ్రెస్ నేతలు నిధుల కోసం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తూ, తిరిగి హైదరాబాద్ వచ్చి కేంద్రాన్ని విమర్శించడం విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. చిప్ప చేత పట్టుకుని ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.తెలంగాణలో రైతులు బతుకుతున్నారంటే అది కేంద్ర ప్రభుత్వ సహకారమేనని ఆయన స్పష్టం చేశారు. దేశంలోనే అత్యధిక ధాన్యాన్ని తెలంగాణ నుంచే కేంద్రం కొనుగోలు చేస్తోందని తెలిపారు. అలాగే యూరియా కూడా తెలంగాణకు ఎక్కువగా కేటాయిస్తున్నామని చెప్పారు.పెట్రోల్ ధరల పెరుగుదలపై మాట్లాడుతూ, ప్రపంచ పరిస్థితుల కారణంగా ధరలు పెరగడం సహజమని అన్నారు. ప్రపంచంలో పెట్రో ధరలను నియంత్రించిన దేశాల్లో భారత్ ముందుందని పేర్కొన్నారు.మే 10న హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉండనుందని, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో ఈసారి బీజేపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.రేపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని, దేశవ్యాప్తంగా బీజేపీ విజయోత్సాహం కనిపిస్తుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
