విజయవాడ, మే 03, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని, ప్రజాధనాన్ని దోచుకుని ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు.కూటమి ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం ఉంచి వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తనకు బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.అమరావతి అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాకుండా రాష్ట్ర సంపద అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడులు రావడం చంద్రబాబు పాలనపై ఉన్న విశ్వాసమేనని అన్నారు. జగన్ హయాంలో కియా, అమర్ రాజా వంటి పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయని ఆరోపించారు. కొత్తగా ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం వస్తున్న పరిశ్రమలను తమ కృషిగా చూపించడం వైసీపీ నేతల అసత్య ప్రచారమని మండిపడ్డారు.మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై స్పందిస్తూ, ఆయనకు అన్ని పార్టీల్లో తలుపులు మూసుకుపోయాయని, అందుకే చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేస్తున్నారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
