మే 04, (నేటి తెలుగు పత్రిక): ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాహారం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్తో రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో మూడు సంవత్సరాలు కొనసాగించేందుకు ఒప్పందం కుదిరింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఇప్పటికే సన్న బియ్యం, గుడ్లు, చిక్కీలు అందిస్తుండగా, అదనంగా రాగిజావను కూడా వారానికి పలుమార్లు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, పోషక స్థాయిలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. రాగి పిండి, బెల్లం వంటి పదార్థాలను ట్రస్ట్ ఉచితంగా సరఫరా చేస్తుండగా, మూడు సంవత్సరాల్లో సుమారు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.
