మే 04, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆస్తులపై చట్టబద్ధ భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబానికి చెందిన ఇళ్లు, స్థలాలు, వాణిజ్య ఆస్తుల వివరాలతో ప్రత్యేక ప్రాపర్టీ కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది.ఈ కార్యక్రమం ద్వారా ఆస్తి యాజమాన్యంపై స్పష్టత పెరగడంతో పాటు భవిష్యత్తులో వివాదాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గతంలో నిలిచిపోయిన నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించనున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న స్వామిత్వ పథకం తరహాలోనే పట్టణాల్లోనూ ఆధునిక సాంకేతికతతో ఆస్తుల నమోదును చేపట్టనున్నారు. డ్రోన్లు, జీఐఎస్ సాంకేతికతతో ప్రతి ఆస్తిని ఖచ్చితంగా మ్యాపింగ్ చేసి డిజిటల్ రికార్డులు సిద్ధం చేయనున్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘నక్ష’ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని కాకినాడ, ఏలూరు, గుంటూరు, మంగళగిరి–తాడేపల్లి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కుప్పం, అనంతపురం వంటి పట్టణాలను ఎంపిక చేశారు. గతంలో ప్రారంభమైన పనులు పూర్తికాకపోవడంతో ప్రాజెక్టు నిలిచిపోయినా, ప్రస్తుతం వాటిని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రతి ఆస్తికి యూనిక్ ఐడీతో కూడిన ప్రాపర్టీ కార్డు జారీ అవుతుంది. దీంతో బ్యాంకు రుణాలు పొందడం సులభమవడంతో పాటు భూ వివాదాలు, అక్రమ ఆక్రమణలు, డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు తగ్గే అవకాశముంది.దశలవారీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు.
