మే 04, (నేటి తెలుగు పత్రిక): సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను తీవ్రంగా వేధిస్తోందని ఆయన ఆరోపించారు. శనగ పంట కోతకు నెల రోజులు దాటినా ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు చేయలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా పథకం సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. అన్ని పంటలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి రైతులను మోసం చేశారని అన్నారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతు బంధు పథకం 11 సార్లు అమలయ్యిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం 9 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారని తెలిపారు.కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ అన్నారు. ధాన్యం దళారుల చేతికి వెళ్లేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. సివిల్ సప్లై కార్పొరేషన్లో భారీ అవినీతి జరిగిందని కూడా ఆరోపించారు.రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ప్రాణాలు కోల్పోతున్నా స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మద్దతుగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు.అవసరమైతే తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించిన కేటీఆర్, ధాన్యం కొనుగోళ్లు జరిగే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రేవంత్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తామని ప్రకటించారు.
