మే 04, (నేటి తెలుగు పత్రిక): వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్డీయే ఆధిక్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నేతలు స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, అస్సాంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వెస్ట్ బెంగాల్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, అక్కడి పరిస్థితులకు చెక్ పెట్టారని అన్నారు.దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ట్రెండ్స్లో ఎన్డీయే కూటమి బలంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో రెండో స్థానంలో, కేరళలో గణనీయమైన ఓట్షేర్ సాధించామని తెలిపారు. “సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా ప్రయాస్” నినాదంతో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు పొందుతోందని అన్నారు.కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ, ప్రతి ఎన్నికలో బీజేపీని ఎదుర్కోవడానికి అవి కలిసివస్తున్నాయని ఆరోపించారు. అయితే అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీజేపీ విజయానికి ప్రధాన కారణమని సత్యకుమార్ స్పష్టం చేశారు.దేశంలోని పశ్చిమ, తూర్పు, దక్షిణ, ఈశాన్య ప్రాంతాల్లో బీజేపీకి ప్రజలు మద్దతు ఇస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
