మే 04, (నేటి తెలుగు పత్రిక): వెస్ట్ బెంగాల్లో బీజేపీ సాధించిన విజయాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడం, బెంగాల్లో భారీ విజయం సాధించడం పార్టీకి గొప్ప మైలురాయిగా పేర్కొన్నారు.విజయవాడలో పార్టీ శ్రేణులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న ఆయన, కార్యకర్తలకు స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి నుంచి, ఇప్పుడు వందల సంఖ్యలో సీట్లు గెలుచుకోవడం బీజేపీ ఎదుగుదలకు నిదర్శనమన్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, చొరబాట్లు, హింసాత్మక ఘటనలు, కేంద్ర పథకాల దుర్వినియోగం వంటి అంశాలను ప్రస్తావించారు. అయినప్పటికీ ప్రజలు ఈసారి స్పష్టమైన తీర్పు ఇచ్చి బీజేపీకి మద్దతు పలికారని అన్నారు.ఈ విజయాన్ని శ్యామ ప్రసాద్ ముఖర్జీ కలల సాకారంగా అభివర్ణించిన ఆయన, ఆయన స్వస్థలమైన బెంగాల్లో బీజేపీ జెండా ఎగరవేయడం గర్వకారణమన్నారు.దేశవ్యాప్తంగా ప్రజలు అభివృద్ధి, స్థిరత్వం కోరుకుంటున్నారని, అదే బీజేపీ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలు నమ్మకం ఉంచారని, ఈ ఫలితాలు ఆ విశ్వాసానికి నిదర్శనమని శ్రీనివాస వర్మ తెలిపారు.
