కరీంనగర్, మే 04, (నేటి తెలుగు పత్రిక): : కరీంనగర్ ఆకాశవాణి (AIR) కేంద్రాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని స్థానిక నివాసులు, కళాకారులు, రచయితలు అయిన శరత్ సాహితీ కళా స్రవంతి కరీంనగర్ అధ్యక్ష కార్యదర్శులు సబ్బని లక్ష్మీనారాయణ, సంకేపల్లి నాగేంద్ర శర్మ, శ్రీ అరబిందో సొసైటీ కరీంనగర్ సెంటర్ అధ్యక్షలు కోల అన్నారెడ్డి, ఉప్పల రామేశం, విశ్రాంత ఉపాధ్యాయులు, కవి మిత్రులు వెల్ముల జైపాల్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు కరీంనగర్ ఎంపీ మరియు కేంద్ర గృహ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.ప్రస్తుతం కరీంనగర్ ఆకాశవాణి కేంద్రంలో ప్రోగ్రామ్ రూపకల్పన, రికార్డింగ్కు తగిన సదుపాయాలు లేవని, దీనివల్ల స్థానిక ప్రతిభకు అవకాశాలు తగ్గుతున్నాయని వారు పేర్కొన్నారు. వ్యవసాయాధారిత ప్రాంతమైన కరీంనగర్లో రైతులకు రేడియో కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం కేంద్రాల సరసన కరీంనగర్ కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేసి, హై పవర్ ట్రాన్స్మిషన్ సెంటర్గా మార్పు చేయడంతో పాటు ప్రోగ్రామ్ రూపకల్పన మరియు రికార్డింగ్ స్టూడియోలు తగిన సిబ్బందితో ఏర్పాటు చేయాలని కోరారు.ఈ చర్య ప్రాంతీయ సంస్కృతిని ప్రోత్సహించి ప్రజా ప్రసార సేవలను బలోపేతం చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై బండి సంజయ్ కుమార్ తగిన చర్యలు తీసుకోవడానికి తోడ్పడగలనని సానుకూలంగా స్పందించారు.
