మే 05, (నేటి తెలుగు పత్రిక): గత ప్రభుత్వ కాలంలో జరిగిన విద్యుత్ కొనుగోలు వ్యవహారాలు, భద్రాద్రి మరియు యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జస్టిస్ మదన్ బి. లోకూర్ నేతృత్వంలోని కమిషన్ సమర్పించిన నివేదికపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో సంబంధం ఉండటంతో నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని భావించిన కేబినెట్, సీబీఐ విచారణకు అప్పగించాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అకాల వర్షాలతో పంట నష్టంపై మంత్రివర్గం చర్చించి, రైతులకు తక్షణ సహాయం అందించేందుకు సంబంధిత మంత్రులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే భూముల మార్కెట్ విలువల్లో ఉన్న వ్యత్యాసాలను సరిచేయడానికి ధరలను రేషనలైజ్ చేయాలని నిర్ణయించింది.ప్రాజెక్టుల కారణంగా భూములు కోల్పోతున్న నిర్వాసితుల పరిహారం అంశంపై కూడా చర్చించి, శాస్త్రీయ పద్ధతిలో ధరలను సవరించేందుకు ఆమోదం తెలిపింది. హిల్ట్ పాలసీ కింద దరఖాస్తుదారులకు 10 శాతం ముందస్తు చెల్లింపు, మిగతా మొత్తం 90 రోజుల్లో చెల్లించే విధానం ప్రవేశపెట్టారు.రాష్ట్రంలోని ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు, టీ-శాట్ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. నల్గొండ–రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుకు అప్పగించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.ఇక రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి విస్తరణకు భాగంగా 33/11 కేవీ సబ్ స్టేషన్ల సమీపంలో పైలెట్ ప్రాజెక్టులుగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెండింగ్ పన్నుల క్లియరెన్స్ కోసం వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) అమలు చేయాలని నిర్ణయించారు.అదనంగా, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్లో ఆధునిక కూరగాయల మార్కెట్ నిర్మాణానికి 42 ఎకరాల భూమి కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
