మే 05, (నేటి తెలుగు పత్రిక): బెంగాల్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచాయని, ఆ ప్రభావం తెలంగాణలోనూ బీజేపీకి అనుకూలంగా మారుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని, అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజావ్యతిరేక పాలనకు గుణపాఠం చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకు కాంగ్రెస్, ఇండీ కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని ఆరోపించారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బెంగాల్ ఫలితాలు తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం సృష్టిస్తాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, విభజన రాజకీయాలకు ప్రజలు గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. దేశాన్ని విభజించే ప్రయత్నాలు చేసిన వారికి ప్రజల తీర్పు స్పష్టమైన సందేశమని అన్నారు.బీజేపీ నేతలు ఈటల రాజేందర్, అరవింద్, లక్ష్మణ్ తదితరులు కూడా తెలంగాణలో రాజకీయ మార్పు ఖాయమని, పార్టీ అధికారంలోకి రావడం లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.
