మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగర ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు నగరంలో మూడు కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అల్వాల్ లయోలా కాలేజీ, ఆనంద్ బాగ్, మౌలాలీ క్వార్టర్స్ ప్రాంతాల్లో ఈ స్టేషన్లు నిర్మించాలని యోచిస్తోంది.ఇప్పటికే ఈ ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు పంపగా, ఆమోదం వచ్చిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ కొత్త స్టేషన్లు ఏర్పడితే మరింత మంది ప్రయాణికులకు ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఘట్కేసర్ నుంచి సనత్నగర్ వరకు ఎంఎంటీఎస్ రెండో దశలో రైళ్ల రాకపోకలు ప్రారంభమైన నేపథ్యంలో మధ్యలో కొత్త స్టేషన్ల అవసరం పెరిగింది. ముఖ్యంగా లయోలా కాలేజీ వద్ద స్టేషన్ నిర్మించాలని విద్యార్థులు, స్థానికులు కోరడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టారు.చర్లపల్లి నుంచి నేరేడ్మెట్ వరకు స్టేషన్ లేకపోవడంతో మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆనంద్ బాగ్ వద్ద స్టేషన్ నిర్మిస్తే వారికి పెద్దగా ఉపయోగం ఉంటుంది. అలాగే మౌలాలీ ప్రాంత ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ఎంఎంటీఎస్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోంది. రెండో దశ పనుల కోసం నిధులు కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.అదనంగా ఎంఎంటీఎస్ సేవలను యాదాద్రి వరకు విస్తరించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఈ పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.
