మే 08, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తీసుకురావడంతో పాటు వాటికి అనుబంధంగా ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన ఆయన, పెట్టుబడులతో ఏర్పడే ఎకోసిస్టంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు భూ కేటాయింపులు, అనుమతుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. 22ఏ పరిధిలో ఉన్న ఏపీఐఐసీ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సూచించారు.అరకు కాఫీలా ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తులకు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ఉత్పత్తులకు నాణ్యత, మార్కెటింగ్ కల్పిస్తే భారీ ఆదాయం సాధ్యమవుతుందని చెప్పారు.గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ రాష్ట్రానికి రావడంతో ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా ఏపీ వైపు చూస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. డేటా సెంటర్లు, క్వాంటం కంప్యూటింగ్ రంగాలకు అవసరమైన పరికరాల తయారీకి అనుకూల వాతావరణం ఏర్పడుతోందన్నారు. అమరావతిలో క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు.రాష్ట్రంలో 15 లేబర్ అడ్డాలు నిర్మిస్తున్నామని, కార్మికులకు అక్కడే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కూడా ఇస్తామని తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచి వైద్య ఖర్చులు తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.సౌర విద్యుత్ ఉత్పత్తిపై కూడా సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైల్వే మార్గాల విస్తరణ, లాజిస్టిక్స్ పార్కుల ద్వారా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు. పంటలు, పశువుల దాణా, నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామని కూడా సీఎం చంద్రబాబు వెల్లడించారు.
