Breaking News

బీసీ కులగణనపై ప్రధాని స్పష్టత ఇవ్వాలి: అఖిలపక్ష బీసీ నేతలు

మే 08, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష బీసీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ ఐకాసా చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, బీసీలకు న్యాయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.దేశ జనగణనలో సమగ్ర కులగణన చేపడతామని కేంద్ర కేబినెట్ ప్రకటించినప్పటికీ, అమలులో మాత్రం వెనక్కి తగ్గిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న కుటుంబ లెక్కింపులో ఓబీసీ కుటుంబాలను ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.బీసీలకు సంబంధించిన పది కీలక ప్రశ్నలను ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా, బీసీ రిజర్వేషన్ల పెంపు, ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టడం వంటి అంశాలపై కేంద్రం వైఖరి ఏమిటో వెల్లడించాలని కోరారు.తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఇప్పటికీ ఆమోదించకపోవడాన్ని కూడా నేతలు తప్పుబట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పిన తర్వాతే తెలంగాణ పర్యటనకు రావాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసనలు చేపడతామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్ అమరవీరుల స్థూపం వద్ద కూడా నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.మాజీ ఎంపీ వి. హనుమంతరావు మాట్లాడుతూ, బీసీ కులగణన కోసం తాను ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నానని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు సిరికొండ మధుసూదనాచారి, వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఓబీసీల లెక్కింపును విస్మరించడం అంటే వారి అస్తిత్వాన్ని నిరాకరించడమేనని వ్యాఖ్యానించారు.సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, బీసీల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మహిళా సాధికారతకు కొత్త దిశ.. తెలంగాణలో జిల్లా మహిళా సమాఖ్య భవనాలు సిద్ధం

కరీంనగర్ ఘటనపై డీజీపీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *