మే 08, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన ఉద్రిక్త ఘటనపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.తనపై జరిగినది సాధారణ దాడి కాదని, పక్కా ప్రణాళికతో హత్యాయత్నం జరిగిందని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు.మీడియాతో మాట్లాడుతూ “నన్ను భయపెట్టడానికే కాదు.. హత్య చేయడానికే దాడికి వచ్చారు” అని వ్యాఖ్యానించారు. తనపై ముందుగానే రెక్కీ నిర్వహించారని, ప్రమాదం ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంలో కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో బయట బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అనంతరం ఉద్రిక్తత పెరగడంతో కౌశిక్ రెడ్డి వాహనంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసినట్లు సమాచారం. కార్యాలయంలోని ఫర్నిచర్ కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తూ ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం కౌశిక్ రెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల వల్లే కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమైందని చెబుతున్నారు.
