మే 08, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో లక్షకు పైగా జనాభా ఉన్న మండలాల్లో అవసరాన్ని బట్టి అదనపు తహసీల్దార్లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.హైదరాబాద్లో ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చించారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాలకు ఉమ్మడి సర్వే ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందిరమ్మ పథకం కింద అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఇళ్ల బిల్లుల జారీలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గతంలో ఇళ్ల కోసం సేకరించిన భూముల్లో ఖాళీలు ఉంటే వాటిని పేదల ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని అధికారులకు సూచించారు. అలాగే డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 20లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.ఆర్డీవోలు అధికార దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
