మే 08, (నేటి తెలుగు పత్రిక): తలసేమియా అంటువ్యాధి కాదని, ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యుపరమైన వ్యాధి అని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు బాధితులకు అన్ని విధాల సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన మంత్రి, సమీప బంధువుల మధ్య వివాహాలు జరిగే సందర్భాల్లో తలసేమియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. యువత వివాహానికి ముందు తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొత్తగా వివాహమైన దంపతులకు కూడా జన్యుపరమైన వ్యాధులపై అవగాహన అవసరమన్నారు.తలసేమియా, ఇతర జన్యుపరమైన వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో సికిల్ సెల్ వ్యాధిపై దాదాపు 11 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించామని వెల్లడించారు.వ్యాధి నిర్ధారణ అయిన రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స, అవసరమైన మందులు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. తలసేమియా బాధితులకు క్రమం తప్పకుండా రక్త మార్పిడి అవసరమవుతుందని, ఐరన్ చెలేషన్ థెరపీ వంటి చికిత్సలు కూడా చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.కొన్ని తీవ్రమైన సందర్భాల్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరమవుతుందని, ఈ చికిత్సల ఖర్చు కుటుంబాలపై భారీ భారం అవుతుందని మంత్రి వివరించారు. అందుకే తలసేమియా, ఇతర రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి అన్ని దశల్లో ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, అవసరమైన మందులు, అధునాతన చికిత్స సౌకర్యాలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లోని నిమ్స్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతర సేవలు అందించేందుకు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రత్యేక డే కేర్ సెంటర్లు పనిచేస్తున్నాయని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.
