మే 08, (నేటి తెలుగు పత్రిక): యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండి నిబద్ధతతో ముందుకు సాగాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగానే ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.హనుమకొండలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన మెగా జాబ్మేళాను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, కలెక్టర్ సత్యశారదదేవి తదితరులు పాల్గొన్నారు.మెగా జాబ్మేళాకు భారీ సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత తరం యువతలో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. సమాజంలో పోటీ పెరిగిందని, అందుకే యువత తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని సూచించారు.“మనం తప్పు చేయనంతవరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు” అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మత్తుపదార్థాలకు బానిసైతే భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. కష్టపడి పనిచేస్తేనే విజయాలు సాధ్యమవుతాయని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్మేళాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోందని మంత్రి వెల్లడించారు. ప్రైవేట్ రంగంలో కూడా యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
