మే 09, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో పెద్ద మార్పుకు శ్రీకారం చుడుతోంది. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం (NEP)కు అనుగుణంగా 12వ తరగతి వరకు ఒకే విద్యా వ్యవస్థను అమలు చేయాలనే లక్ష్యంతో ఈ కసరత్తు ప్రారంభించింది.ఈ కొత్త విధానం ప్రకారం పదో తరగతి తర్వాత విద్యార్థులు జూనియర్ కాలేజీలకు వెళ్లకుండా అదే పాఠశాలలో 11వ తరగతి, 12వ తరగతి చదివే అవకాశం కల్పించనున్నారు. దీనిని ప్లస్ టూ విద్యా విధానంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి 2026–27 విద్యాసంవత్సరం నుంచే 11వ తరగతి బోధన ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరించనున్నారు.ఈ మార్పు అమలైతే పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య ఒకే వ్యవస్థ కిందకు వస్తాయి. ఒకే బోర్డు ద్వారా పరీక్షలు, పాఠ్యాంశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (TGESB) ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉంది.ప్రస్తుతానికి ఉన్న రెండు వేర్వేరు చట్టాలను విలీనం చేయాల్సి ఉంటుంది. పాఠశాల విద్యకు సంబంధించిన చట్టం, ఇంటర్ విద్యా చట్టంలో మార్పులు చేసి కొత్త వ్యవస్థను రూపొందించనున్నారు. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశమున్నట్లు సమాచారం.విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. 2026–27 విద్యాసంవత్సరం నుంచే మొదటి దశ అమలుకు ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది.ఈ ప్రతిపాదన అమలైతే రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
