మే 09, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ అభివృద్ధికి CURE, PURE, RARE మోడల్ను ఆధారంగా చేసుకుని సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ రహితంగా మార్చడమే లక్ష్యంగా పలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం వెల్లడించారు. నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా అభివృద్ధి చేయడానికి అండర్పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ రోడ్లతో మూడు స్థాయిల రవాణా వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించామని చెప్పారు.పట్టణాభివృద్ధిని మూడు విభాగాలుగా విభజించినట్లు ఆయన తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ప్రాంతాన్ని CURE జోన్గా గుర్తించి సర్వీస్ సెక్టార్గా అభివృద్ధి చేస్తామని, ORR బయట నుంచి రీజనల్ రింగ్ రోడ్ (RRR) మధ్య ప్రాంతాన్ని PURE జోన్గా మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్గా అభివృద్ధి చేస్తామని వివరించారు. RRR బయట ప్రాంతాన్ని RARE జోన్గా గుర్తించి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు.ఈ మోడల్తో పాటు “తెలంగాణ రైజింగ్–2047” మాస్టర్ ప్లాన్ను రూపొందించామని సీఎం తెలిపారు. దీని ద్వారా రాష్ట్రాన్ని దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.హైదరాబాద్లో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అలాగే ఆటో రిక్షాలను కూడా ఉచితంగా రీట్రోఫిటింగ్ చేసి ఈవీ వాహనాలుగా మార్చే ప్రణాళిక ఉన్నట్లు వెల్లడించారు. మూసీ నది ఫ్రంట్ అభివృద్ధి పనులను కూడా చేపట్టి, నగర సంస్కృతితో అనుసంధానం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ సమగ్ర ప్రణాళికలతో హైదరాబాద్ను ఆధునిక, సుస్థిర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
