మే 09, (నేటి తెలుగు పత్రిక): తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డికి “పొలిటికల్ స్కోరింగ్” తప్ప “స్టేట్ స్కోరింగ్” లేదని వ్యాఖ్యానించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం స్పష్టత లేకుండా వ్యవహరిస్తోందని హరీశ్ ఆరోపించారు. ఒకవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని చెబుతుండగా, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సుందిళ్ల వరకు నీళ్లు వస్తాయని చెప్పడం గందరగోళానికి దారితీస్తోందన్నారు. ఇందులో అసలు నిజం ఏదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా మహారాష్ట్రతో సమన్వయం సాధించలేకపోయిందని ఆయన విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే మహారాష్ట్రతో చర్చలు ప్రారంభించిందని గుర్తు చేశారు.తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ అంచనా వ్యయం కాంగ్రెస్ హయాంలో భారీగా పెరిగిందని హరీశ్ ఆరోపించారు. ఒకప్పుడు రూ.17 వేల కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్ వ్యయం ఇప్పుడు రూ.40 వేల కోట్లకు చేరిందన్నారు. కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడితే “దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతుల విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. 30 నెలలు గడిచినా మూడు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేయలేదని, ప్రస్తుతం వేల క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు వెళ్తోందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ను విమర్శించడం కంటే, దానిని సమర్థంగా వినియోగించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హరీశ్ సూచించారు. తుమ్మిడిహెట్టి పేరుతో రాజకీయ డ్రామాలు ఆపి మేడిగడ్డ మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కూడా హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులు, మహిళల అదృశ్య ఘటనలు పెరుగుతున్నాయని కేంద్ర నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు. పోలీసులను రాజకీయ వేధింపులకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ, హోం మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
