మే 10, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి రంగంలో మరో కీలక మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్–2025 అవార్డుల్లో దేశవ్యాప్తంగా ఏపీ రెండో స్థానం సాధించింది. ఈ విజయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్థానిక సంస్థల బలోపేతానికి కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం గర్వకారణమని అన్నారు.గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమష్టి కృషి వల్లే ఈ అవార్డులు సాధ్యమయ్యాయని పవన్ తెలిపారు. ముఖ్యంగా శృంగవరం, బొక్కసంపాలెం, చెముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం రాష్ట్రానికి గౌరవంగా నిలిచిందన్నారు.ఈ గ్రామాల సర్పంచ్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలకు పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పారదర్శక పాలన, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగానే ఈ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్తులో గ్రామీణాభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.
