మే 10, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.ఆదివారం హైదరాబాద్కు చేరుకున్న ప్రధాని మోదీ, అధికారిక కార్యక్రమాల అనంతరం నేరుగా పవన్ నివాసానికి వెళ్లారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు సమాచారం. ఈ భేటీ రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.ప్రధాని రాక సందర్భంగా పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. పవన్ను పరామర్శించేందుకు ప్రధాని స్వయంగా రావడం జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎస్పీజీ బృందాలు, రాష్ట్ర పోలీసు బలగాలు భద్రతను పర్యవేక్షించాయి.ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్టు చేశారు. తెలంగాణలో రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న ప్రధానికి స్వాగతం పలుకుతూ, రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న చొరవకు కృతజ్ఞతలు తెలిపారు.మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానం, యువతకు కొత్త అవకాశాల కల్పనలో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని పవన్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నందుకు జనసేన పార్టీ తరఫున ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
