మే 11, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజా హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పనతో పాటు ఆమె సహచరులు పుణెలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన 10 ప్రత్యేక బృందాలు ప్రస్తుతం పుణెలో నిందితుల కోసం వెతుకుతున్నాయి. ప్రధాన నిందితురాలు కల్పన గతంలో లఖ్నవూలో కూడా పలు నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.తనూజా ఇంటి నుంచి సుమారు 225 గ్రాముల బంగారం, నగదు దోచుకుని ఈ నేపాలీ గ్యాంగ్ పరారైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు దేశం విడిచి వెళ్లే అవకాశం ఉండటంతో ఢిల్లీ, ముంబై, నేపాల్ సరిహద్దుల్లో కూడా నిఘా పెంచారు.సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, ప్రయాణ వివరాల ఆధారంగా నిందితుల కదలికలను పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నామని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీపీ సజ్జనార్ తెలిపారు.
