మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం నేటి నుంచి విద్యావారోత్సవాలను నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అధికారికంగా ప్రారంభించనున్నారు.ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగే విద్యావారోత్సవాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు భాగస్వామ్యం కానున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, డిజిటల్ విద్య, ఆధునిక తరగతి గదులు, పరిశుభ్రమైన వసతులు, మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. విద్యావారోత్సవాల సందర్భంగా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యా చర్చలు, తల్లిదండ్రుల సమావేశాలు, విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచడం, విద్యార్థుల నమోదు శాతం పెంచడం కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా అధికారులు తెలిపారు.
