మే 11, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాఖండ్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మే 12, 13 తేదీలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. చార్ధామ్ యాత్ర కొనసాగుతున్న సమయంలో ఈ హెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, రహదారులు దెబ్బతినే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీంతో యాత్రికులు ప్రయాణానికి ముందు వాతావరణ పరిస్థితులపై పూర్తి సమాచారం తెలుసుకోవాలని సూచించారు.గఢ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ప్రయాణం చేయాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. రాత్రి వేళల్లో ప్రయాణాలు తగ్గించాలని, అత్యవసర మందులు, చలి దుస్తులు వెంట తీసుకెళ్లాలని సూచించారు.భారీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ బృందాలు, వైద్య సిబ్బంది, సహాయక బృందాలను ప్రభుత్వం అప్రమత్తంగా ఉంచింది. యాత్ర మార్గాల్లో పర్యవేక్షణ పెంచినట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే పాటించాలని సూచించారు.ఇటీవల హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ మార్పులు వేగంగా చోటుచేసుకుంటుండటంతో చార్ధామ్ యాత్ర భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. యాత్రికులు జాగ్రత్తగా ప్రయాణించి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు మరోసారి హెచ్చరించారు.
