మే 11, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన సీఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సీఎం, పారిశ్రామిక పురోగతిలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వేగంగా పారిశ్రామికాభివృద్ధి దిశగా పయనిస్తోందని పేర్కొన్నారు.1990ల ఆర్థిక సంస్కరణల ఫలితాలను ఇప్పుడు దేశం అనుభవిస్తోందని చంద్రబాబు అన్నారు. వినూత్న ఆలోచనలు, సాంకేతికత, పరిశ్రమలకు అనుకూల విధానాలతో భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని చెప్పారు. సరైన సమయంలో సరైన నాయకత్వం దేశానికి లభించిందని ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కనిపిస్తున్నప్పటికీ, భారత్పై దాని ప్రభావం తగ్గేలా కేంద్ర ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించిందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ రంగాల వైపు వేగంగా అడుగులు వేస్తోందని, భారత్ కూడా అదే దిశగా ముందుకు సాగుతోందన్నారు.ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అత్యంత అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. పారదర్శక పాలన, వేగవంతమైన అనుమతులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన యువశక్తి ఏపీ బలమని పేర్కొన్నారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు పెరుగుతాయని, యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు అందుతాయని చెప్పారు.రాష్ట్రాన్ని టెక్నాలజీ, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోందని చంద్రబాబు వెల్లడించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
