మే 11, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలక రహదారి ప్రాజెక్టులపై చర్చించారు. ముఖ్యంగా గుంటూరు–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు.కాజా టోల్గేట్ సమీపంలోని వెస్ట్ బైపాస్ వద్ద భారీ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని పెమ్మసాని వివరించారు. చిన్నకాకాని జంక్షన్ వద్ద గ్రేడ్ సెపరేటెడ్ ఇంటర్చేంజ్ లేకపోవడంతో వాహనాలు సర్వీస్ రోడ్ల ద్వారా మళ్లించాల్సి వస్తోందని తెలిపారు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.ఇక రైల్వే అభివృద్ధి అంశాలపై తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. పల్నాడు ప్రాంత అభివృద్ధికి కీలకమైన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిడుగురాళ్ల–సావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కనెక్టివిటీ వల్ల పల్నాడులో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.అలాగే సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలుకు నడికుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో హాల్ట్ ఇవ్వాలని కోరారు. లింగంపల్లి–విజయవాడ ఎక్స్ప్రెస్కు కూడా అదనపు స్టాప్లపై ప్రతిపాదనలు సమర్పించారు. విజయవాడ–బెంగళూరు మధ్య కొత్త వందేభారత్ రైలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తూ, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారులకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు.ఎంపీ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. పల్నాడు ప్రాంత రైల్వే సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడైంది.
