మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయి. ఇప్పటికే పాలు, కూరగాయలు, వంటనూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు బ్రెడ్ ధరలు కూడా పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో పలు బ్రెడ్ తయారీ సంస్థలు ఒక్కో ప్యాకెట్పై రూ.5 వరకు ధరలను పెంచాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు కొత్త ధరలను అమల్లోకి తీసుకురాగా.. మరికొన్ని ప్రముఖ బ్రాండ్లు కూడా త్వరలో ధరలు పెంచే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఉద్యోగులు, విద్యార్థులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇలా ప్రతి వర్గం ప్రజల అల్పాహారంలో బ్రెడ్ కీలక భాగంగా మారింది. తక్కువ సమయంలో సిద్ధమయ్యే ఆహారంగా దీని వినియోగం విస్తరించింది. అయితే వరుస ధరల పెరుగుదలతో ఇప్పుడు బ్రెడ్ కూడా సామాన్య కుటుంబాలకు భారంగా మారుతోంది.బ్రెడ్ ధరల పెంపుకు ప్రధాన కారణంగా ఇంధన ధరల పెరుగుదలని తయారీదారులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో రవాణా ఖర్చులు భారీగా పెరిగాయని పేర్కొంటున్నారు. గోధుమ పిండి నుంచి తయారైన ఉత్పత్తులను మార్కెట్కు చేర్చే వరకు ప్రతి దశలో వ్యయం అధికమైందని వివరిస్తున్నారు. దీనికి తోడు బేకింగ్ గ్యాస్, విద్యుత్ చార్జీలు, కార్మిక వ్యయం, గిడ్డంగుల అద్దెలు కూడా పెరగడం కంపెనీలపై అదనపు భారం మోపుతోంది. ఉప్పు, ఈస్ట్, ప్రిజర్వేటివ్లు వంటి ముడిసరుకు ధరల్లో కూడా పెరుగుదల నమోదైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్యాకేజింగ్ ఖర్చులు కూడా గణనీయంగా పెరిగినట్లు తయారీదారులు వెల్లడించారు. ప్లాస్టిక్ ముడిసరుకు దిగుమతుల వ్యయం పెరగడంతో బ్రెడ్ కవర్ల ధరలు అధికమయ్యాయని పేర్కొన్నారు.మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. త్వరలో బన్స్, కేక్స్, బిస్కెట్లు, పేస్ట్రీలు వంటి ఇతర బేకరీ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో రాబోయే రోజుల్లో వినియోగదారులపై మరింత ఆర్థిక భారం పడే పరిస్థితి కనిపిస్తోంది.
