మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భర్తపై ఆమె తన తల్లితో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన జహంగీర్పురి ప్రాంతంలో కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం.. బాధిత యువకుడు కొంతకాలంగా తన భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ తరచూ గొడవపడుతున్నాడు. ఘటన జరిగిన రోజు కూడా ఇదే విషయంపై ఇంట్లో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.రాత్రి సమయంలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు షార్ట్సర్క్యూట్ అనుకున్నారు. అయితే కొద్ది సేపటికే శరీరం మొత్తం మంటల్లో చిక్కుకుని యువకుడు బయటకు పరుగెత్తుకుంటూ రావడంతో అసలు విషయం బయటపడింది. స్థానికులు వెంటనే మంటలు ఆర్పి అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు ఇచ్చిన వాంగ్మూలంలో.. తన భార్య, అత్త కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు, కాల్ రికార్డులు, పొరుగువారి వాంగ్మూలాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ముందస్తు ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. కుటుంబ కలహాలు ఇంత దారుణానికి దారితీయడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
