ప్రజా పాలనపై డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ చెప్పుకుంటున్నా, ప్రజలు మాత్రం క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజా భవన్లో 2008 డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. వారు తమకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నియామక పత్రాలు ఎప్పుడు అందిస్తారని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా, డీఎస్సీ అభ్యర్థులు మాట్లాడుతూ, “2008 డీఎస్సీ అభ్యర్థుల కోసం జీవో నెంబర్ 9 తెచ్చి క్యాబినెట్ అప్రూవల్ చేసినప్పటికీ, సంవత్సరం గడిచినా కూడా ఉద్యోగాలు ఇవ్వడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. “చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండోసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయడంతో పాటు, 100 రోజులు కావొస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్స్ తీసుకోని నాలుగు నెలలు అవుతోంది. ఒరిజినల్స్ సర్టిఫికేట్లు లేనందున మనం ఇతర ఉద్యోగాలు కూడా చేసుకోలేకపోతున్నాం” అని వారు వివరించారు.
ఇంతేకాదు, “ఇంట్లో వాళ్లపై ఆధారపడలేక, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని” ఈ అభ్యర్థులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. 2008 డీఎస్సీ అభ్యర్థులు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రేవంత్ రెడ్డి సర్కార్ పై తీవ్ర దృష్టిని సారించారు.
