ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంపై కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు
హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా కేసు నమోదు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో విచారణ నిమిత్తం కేటీఆర్కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసుల మేరకు కేటీఆర్ నందినగర్లోని తన నివాసంలో న్యాయవాదులతో చర్చించి, అనంతరం లీగల్ టీమ్తో కలిసి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఏసీబీ కార్యాలయం వద్ద లీగల్ టీమ్ అడ్డుకట్టు
ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్ కారును పోలీసులు అడ్డుకున్నారు. లీగల్ టీమ్కు అనుమతి లేదంటూ వారిని ఆపి, వారి లేకుండానే ఆఫీస్లోకి రావాలని కోరారు. దీనిపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలని నా హక్కు. నోటీసుల్లో లీగల్ టీమ్ రావద్దని చెప్పారా? ఉంటే చూపించండి,” అని కేటీఆర్ పోలీసులను ప్రశ్నించారు.
భారీ భద్రతతో పోలీసులు
తలవాత తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. అదేవిధంగా, బీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి ఎం. విద్యాసాగర్ను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఆయనతో పాటు సుమారు వంద మంది బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
బీఆర్ఎస్ నేతల అభ్యంతరం
బీఆర్ఎస్ నేతలు దీనిపై మండిపడ్డారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో రాజకీయ కక్షతో చర్యలు తీసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఇది ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధానమని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
