వరంగల్ అభివృద్ధికి కట్టుదిట్టమైన ప్రణాళికలు – మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ
హనుమకొండ: హనుమకొండ కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించామని తెలిపారు.
ప్రత్యేక ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు
పొంగులేటి మాట్లాడుతూ, భద్రకాళి ట్యాంక్ బండ్, టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టులకు ఇప్పటికే నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఆర్టీసీని ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని, అందుకే ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్కు ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా, దాన్ని వెంటనే వరంగల్కు అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు మాస్టర్ ప్లాన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించామని, ఇప్పుడు కొత్తగా 4.5 లక్షల ఇండ్లను మొదటి విడతలో అందిస్తామని ప్రకటించారు. రాబోయే నాలుగేళ్లలో మరో 20 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
- సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు
- లబ్ధిదారులను కులం, మతం, పార్టీ వివక్ష లేకుండా ఎంపిక చేస్తామన్నారు.
- ఇప్పటివరకు 80 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారని, వాటిని స్క్రూటినీ చేసి అర్హులైనవారికి ఇండ్లు అందజేస్తామని తెలిపారు.
- “ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేయని వారు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ ఇండ్లు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది,” అని మంత్రి స్పష్టం చేశారు.
ప్రజలకు చేరువలో ప్రభుత్వం
ప్రభుత్వాన్ని ప్రజల గడపదాకా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, సంక్రాంతి వేళ వరంగల్ ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలు సంతోషం నింపేలా ఉంటాయని మంత్రులు పేర్కొన్నారు.
వరంగల్ అభివృద్ధి పథంలో మరో ముందడుగు వేస్తున్నామని మంత్రులు నొక్కి చెప్పారు.
