స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యం: మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% సీట్లను గెలుచుకోవడమే తమ లక్ష్యమని, గెలిచే ధృఢ నిశ్చయంతో ముందుకెళ్తున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కవిత ఆర్థిక స్థితిపై ప్రశ్నలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆర్థిక స్థితిగతులపై ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. “2014కి ముందు కవిత ఆర్థిక పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఎలాంటి స్థాయికి చేరుకున్నారు? ఈ మార్పు ఎలా సాధ్యమైంది? ప్రజల సొత్తు దోచుకొని సంపద పెంచుకున్నారా?” అని ప్రశ్నించారు.
అలాంటి నేతలకు తెలంగాణ ప్రజల వద్ద తిరిగే హక్కు లేదని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తులను తిరస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్పై గౌరవం.. కానీ పాలనపై విమర్శలు
మహేష్ గౌడ్ మాట్లాడుతూ, “కేసీఆర్ను ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు? పదేళ్లలో రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు. బీఆర్ఎస్ నేతలు ప్రజల డబ్బుతో సోషల్ మీడియాను నడుపుతున్నారు,” అంటూ విమర్శించారు.
ఒకే ఏడాదిలో అభివృద్ధి సాధన
“మేము ఏడాదిలో చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన పనులకు సాటిగా ఉంది. కానీ ప్రచారంలో మా పార్టీ వెనుకబడి ఉంది. కార్యకర్తలు నారాజు దూరం పెట్టి పార్టీ విజయానికి పని చేయాలి,” అని పిలుపునిచ్చారు.
రైతు భరోసా పథకం
రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26న రైతు భరోసా పథకం ప్రారంభించనున్నట్లు మహేష్ గౌడ్ తెలిపారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా అందించడమే లక్ష్యమని అన్నారు.
కార్యకర్తలకు పిలుపు
పార్టీ కార్యకర్తలు ఏకతాటిపై పనిచేస్తే, కాంగ్రెస్ పార్టీని తిరిగి విజయం వైపు నడిపించగలమని మహేష్ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
