జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మాధవీలత రివ్యాక్ట్ – గుండె వేదన పంచుకున్న వీడియో
తెలుగు సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతను ప్రాస్టిట్యూట్ అని పరుష పదజాలం ఉపయోగించడంతో బీజేపీ నేతలు ఘాటుగా వ్యతిరేకించారు. ఈ విమర్శల తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పారు, అయితే మాధవీలత మాత్రం ఈ వ్యాఖ్యలను మర్చిపోలేకపోతున్నారు.
మాధవీలత ఫేస్బుక్లో ఒక వీడియో పోస్టు చేస్తూ ఈ విషయం పై స్పందించారు. ఆమె మాట్లాడుతూ, “నార్మల్గా ఉండటానికి చాలా ప్రయత్నించా, కానీ నాతో అవ్వడం లేదు” అని, కంటతడి పెట్టి తన బాధను పంచుకున్నారు. ఆమె తన వీడియోలో, “నాకు జరిగిన ఆత్మగౌరవ దాడి మీద వర్ణించే పదాలు లేవు. ప్రతిక్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన, దుఃఖం అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి,” అని చెప్పి ఆమె బాధను వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, మాధవీలత తన జీవితంలో ఎన్నో సార్లు తన ఆత్మవిశ్వాసాన్ని చిదిమివేయాలని ప్రయత్నించారని, “పదే పదే ఇదే మాటలే” అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
తన రాజకీయ పోరాటం గురించి మాట్లాడిన మాధవీలత, “నా పార్టీ ప్రజల కోసం, మహిళల కోసం, హిందూ ధర్మం కోసం నిస్వార్థంగా పోరాడుతున్నాను. రూపాయి తీసుకున్నది లేదు, ఎవరికీ ద్రోహం చేయలేదు, మోసం చేయలేదు. కానీ కక్ష గట్టి ఈ మాటలు వినాల్సి వచ్చింది,” అని అన్నారు.
“నా బాధను మీతో పంచుకున్నందుకు క్షమించండి,” అని ఆమె తన అభిమానులకు మరియు సోషల్ మీడియా ఫాలోవర్లకు ధన్యవాదాలు తెలిపారు.
మాధవీలత తన ధైర్యాన్ని కోల్పోనని, “ఈ కష్టాలను అధిగమిస్తాను,” అని స్పష్టం చేశారు. “నా కుటుంబం, అభిమానులు, మరియు శ్రేయోభిలాషులు నాకు శక్తినిస్తారు,” అని ఆమె చెప్పారు.
