కేటీఆర్ పై ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు – ఏసీబీ విచారణను వ్యంగ్యంగా ఎద్దేవా
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శల పర్వం కొనసాగించారు. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన, కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన తీరును తీవ్రంగా విమర్శించారు.
ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, “ఏసీబీ విచారణకు వెళ్లిన కేటీఆర్ లాయర్ లేకుంటే వెళ్లనని డ్రామాలు చేస్తున్నారు. నప్పతట్లోడు అడుక్కుంటే పాపం అని పచ్చిపులుసు పోస్తే, నేతి బుట్ట లేదని లేచి పోయినట్లు మాట్లాడుతున్నారు,” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
తన వ్యాఖ్యల్లో కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డ అరవింద్, “మీ అయ్య ఇంకా సీఎం అనుకుంటున్నారా? పదేళ్ల పాటు తెలంగాణను దోచుకుని తిన్నారు. లక్షల కోట్ల అప్పులు చేసి, తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. దానికి తగిన ఫలితం ఇప్పుడు చట్టం ద్వారా ఎదుర్కోవాల్సి వస్తోంది,” అని విమర్శించారు.
అంతేకాకుండా, “చట్టం తన పని తాను చేసుకుంటోంది. మీ అరాచకాలు కొనసాగితే లాఠీ తన పని తాను చేసుకుంటుంది,” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ తన దూకుడుతో విపక్షంపై వ్యంగ్యాస్త్రాలు విసురుతుండగా, దీనికి బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
