పార్కులు, చెరువుల ఆక్రమణలపై చర్యలు: హైడ్రా ప్రజావాణి మొదటి రోజే 83 ఫిర్యాదులు
ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించిన ఆక్రమణలపై నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు హైడ్రా (Hydra) తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. సోమవారం హైడ్రా కార్యాలయంలో చీఫ్ ఫిర్యాదులను స్వీకరించారు.
తొలిరోజు నుంచే ప్రజలు భారీగా హైడ్రా కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం 83 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వీకరించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైడ్రా ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది.
కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, “ఫిర్యాదులను పరిశీలించి మూడు వారాల్లో చర్యలు తీసుకుంటాం,” అని బాధితులకు భరోసా ఇచ్చారు. చెరువులు, పార్కులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినట్లు పేర్కొన్నారు.
సంక్రాంతి తర్వాత హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం
సంక్రాంతి పండుగ అనంతరం హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు తెలిసింది.
కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, “ఇకపై హైడ్రాకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు హైడ్రా పోలీస్ స్టేషన్ ద్వారా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం,” అని వెల్లడించారు.
ప్రజా ఫిర్యాదుల ఆధారంగా ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకునేందుకు హైడ్రా సిద్ధమవుతోంది.
