తిరుపతి తొక్కిసలాట ఘటన: సీఎం చంద్రబాబుకు అధికారులు వివరణ
తిరుపతి బైరాగిపట్టెడ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుపతి చేరుకున్నారు. ఘటన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం, ముఖ్యమంత్రి అధికారులను తీవ్రంగా హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఏం చేయడానికైనా బాధ్యత తీసుకున్న వారు సక్రమంగా విధులను నిర్వర్తించాలి. పద్ధతినిబట్టి పని చేయడం నేర్చుకోవాలి” అని హితవు పలికారు.
టోకెన్లు జారీ చేసే కౌంటర్ వద్ద 2 వేల మంది మాత్రమే ఉన్నారని భావించి, 2,500 మందిని లోనికి పంపించిన తీరు పై ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడుతూ, “భక్తులు కూర్చున్న సమయంలో పరిస్థితి బాగానే ఉందని మీరు చెప్పారు. కానీ బయటకి పంపించేటప్పుడు ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. అది ఎలా జరిగిందో స్పష్టం చేయాలి” అని ఆయన ప్రశ్నించారు.
ఈ క్రమంలో అధికారులు తనకు వివరణ ఇవ్వగా, సీఎం చంద్రబాబు కఠినంగా స్పందిస్తూ “నో ఎక్స్ ప్లనేషన్స్” అని అన్నారు.
