|| It is our responsibility to protect mother language. – Purandeshwari ||
రాజానగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు: పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రెండో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె తెలుగు భాష గొప్పతనాన్ని వర్ణిస్తూ, మాతృభాష పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు.
“అమ్మ భాషను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. మాతృభాషను పరిరక్షించకపోతే అది మన సంస్కృతికే ప్రమాదం. ప్రపంచంలో ప్రాచీన భాషలుగా గుర్తింపు పొందిన ఆరు భాషల్లో తెలుగు ఒకటి. అంతర్జాతీయంగా ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు 15వ స్థానంలో ఉంది. మన దేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు నాలుగో స్థానంలో ఉంది,” అని పురందేశ్వరి వివరించారు.
ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల మాటలను ఆమె స్మరించుకున్నారు. “‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని అప్పుడే చెప్పారు. తెలుగు భాష గొప్పతనం కోసం అందరం కృషి చేయాలి,” అని పిలుపునిచ్చారు.
తెలుగులో జీవోలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని ఆమె అభిప్రాయపడ్డారు. “ఎన్టీఆర్ హయాంలో జీవోలు తెలుగులో ఇస్తూ, భాషకు ప్రాధాన్యత కల్పించారు. కానీ ప్రస్తుతం తెలుగు మహానదిలా కాదు, పిల్ల కాలువలా మారుతోంది,” అని పేర్కొంటూ భాష గౌరవం కాపాడుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష ప్రాధాన్యతను గుర్తించి, భవిష్యత్ తరాలకు తెలుగును అందించే ప్రయత్నాలు చేయాలని పురందేశ్వరి సూచించారు.
