జీహెచ్ఎంసీ కార్యాలయంలో కాంట్రాక్టర్ల నిరసన: బిల్లుల చెల్లింపుపై ఆందోళన
హైదరాబాద్ జీహెచ్ఎంసీ (GHMC) కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించడం లేదంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కమిషనర్ను కలవడానికి కార్యాలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా, సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుని గేట్లకు తాళాలు వేశారు.
ఈ క్రమంలో ఓ కాంట్రాక్టర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. కానీ వెంటనే పోలీసులు అప్రమత్తమై అతన్ని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిరసన చేస్తున్న కాంట్రాక్టర్లను అదుపు చేయడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. అరెస్టు చేసినా వెనక్కి తగ్గమని కాంట్రాక్టర్ల నాయకులు స్పష్టం చేశారు.
కాంట్రాక్టర్లు కమిషనర్ బయటకు రావాలని డిమాండ్ చేస్తూ, బిల్లుల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిరసనల కారణంగా జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ పరిణామాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి స్పందించారు. కాంట్రాక్టర్ల యూనియన్ లీడర్లను చర్చలకు పిలిచారు. చర్చల అనంతరం కాంట్రాక్టర్లు తాత్కాలికంగా నిరసన విరమించారు. చర్చల ఫలితాల ప్రకారం భవిష్యత్ చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్లు తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాజెక్టులు చేపట్టే కాంట్రాక్టర్ల సమస్యలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. నిరసన నేపథ్యంలో కార్యాలయం వద్ద ఉద్రిక్తత తాత్కాలికంగా తగ్గినట్లు తెలుస్తోంది.
