తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ఢిల్లీకి ఫిర్యాదు
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ స్థాయిలో స్పందన వచ్చింది. ఈ ఘటనకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) నిర్లక్ష్యమే కారణంగా వంగవీటి నరేంద్ర ఆరోపించారు. ఈ సంఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC), కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు పంపినట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రపతికి లేఖ
తొక్కిసలాట ఘటనపై పూర్తి వివరాలతో రాష్ట్రపతికి లేఖ రాసినట్లు వంగవీటి నరేంద్ర తెలిపారు. “ఈ దుర్ఘటనకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలి. టీటీడీ ఛైర్మన్, ఈవోపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.
గత ఘటనలపై విమర్శలు
గోదావరి పుష్కరాలు, కందుకూరు సభ, గుంటూరు ఘటనల సమయంలో కూడా ఇలాంటి విషాదాలు చోటు చేసుకున్నాయని, ఈ సందర్భంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని నరేంద్ర మండిపడ్డారు. “గోదావరి పుష్కరాల్లో 29 మంది బలి కాగా, కందుకూరులో 7గురు, గుంటూరులో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు సీఎం అయ్యే ప్రతిసారీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి” అని వ్యాఖ్యానించారు.
టీటీడీ నియామకాలపై విమర్శలు
“బీఆర్ నాయుడి వంటి అర్హతలేని వ్యక్తిని టీటీడీ ఛైర్మన్గా నియమించడం పూర్తిగా క్విడ్ ప్రో కో చట్టాన్ని అనుసరించి జరిగినది. టీడీపీకి అనుకూలంగా పని చేసినందుకే ఆయనకు ఆ పదవి కట్టబెట్టారు” అని నరేంద్ర ఆరోపించారు.
దారుణ చర్యలపై ఆగ్రహం
తిరుపతి తొక్కిసలాట ఘటనలో సంబంధం లేని వారిపై చర్యలు తీసుకోవడం దారుణం అని ఆయన విమర్శించారు. ఇలాంటి ఘటనలకు ఇకనైనా ఫుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని నరేంద్ర తెలిపారు.
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ, జాతీయ మానవ హక్కుల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని వంగవీటి నరేంద్ర విజ్ఞప్తి చేశారు.
